Sunday, July 27, 2008

కనక మిత్తడి తోడ కలయ సరి దూఁచితే

సామంతం
కనక మిత్తడి తోడ కలయ సరి దూఁచితే
అనువవునా అది దోషమవుఁగాక
పట్టభద్రుడు గూర్చుండే బలు సింహాసనముపై
వెట్టిబంటుఁ బెట్టేవారు వెఱ్ఱులే కారా
కొంకక సింహముండేటి గుహ నుండవచ్చునా
పొంచి నక్కలకెల్ల బొక్కలే కాక. ౨-౧౭

బంగారాన్ని బంగారంతోనే సరి తుయ్యాలి గాని యిత్తడితో తూయగూడదు.అలా చేయడం అనువు కాదు,దోషమవుతుంది.
పట్టభద్రుడు కూర్చొనే పెద్ద సింహాసనము మీద వెఱ్ఱివాడైన బంటుని కూర్చోపెట్టేవాళ్ళు వెఱ్ఱివారే కాదా.
సింహ ముండే గుహలో నక్కకు ఉండతగునా,బొక్కలో కాక.(నక్కకు నివాసం బొక్కలు).
అన్నమయ్య ఎవరెవరు ఏ ఏ నివాస స్థానాల్లో ఉంటే శోభిస్తోందో చెబుతున్నాడిక్కడ.

2 comments:

rākeśvara said...

నమస్కారం
నా పేరు రాకేశ్వర
నేను అందం అనే బ్లాగు వ్రాసూంటాను.
నాకు అన్నమయ్య సాహిత్యం అంటే చాలా ఇష్టం, ఇన్నాళ్ళూ ఈ బ్లాగు కంటపడకపోవడం, ఆశ్చర్యంగా వుంది.

అన్నట్టు సామంతం అనేది పద్యరీతా?
పద్యరీతి అయిన పక్షాన దాని ఛందస్సు ఎటువంటింది.
అలానే అన్నమాచార్యులు పాటలు కాకుండా ఇంకా సాహిత్యం వ్రాసారా?

మీ సమాచారానికి కృతజ్ఞతలు.

Unknown said...

రాకేశ్వర రావు గారూ నమస్కారం.అన్నమయ్య గురించి ఇంకో రెండు బ్లాగులలో కూడా వ్రాస్తున్నాను.అవి
http://kasstuuritilakam.blogspot.com
http://kastuuritilakam.blogspot.com
వీలైతే చూడగలరు.
సామంతం-అనేది ఆ పాట పాడాల్సిన రాగం పేరు.అన్నమయ్యకు ఈ రాగం అంటే చాలా ఇష్టం.ఈ రాగంలో ఆయన సుమారు 900 పైగా సంకీర్తనలను(ఇప్పటికి దొరికినవి)వ్రాసారు.అన్నమయ్య పదాలను పాటలు అని కాకుండా సంకీర్తనలు అని వ్యవహరిస్తుంటారు పెద్దలు.మనమూ అలానే వ్యవహరిద్దాం.
మీ అందం బ్లాగు చూస్తాను.అన్నమయ్య ఇంకా శతకాలను,ఇతర గ్రంధాలను కూడా రచించటం జరిగింది.అవన్నీ ఇంకోసారి తీరికమీద తెలియజేస్తాను.